తన తండ్రి హత్య జరిగి రెండేళ్లవుతున్నా ఇంతవరకు నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి. ఢిల్లీలో సీబీఐ అధికారుల్ని కలసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడని, ప్రస్తుత సీఎం జగన్ కి స్వయానా బాబాయ్ అని, అయినా కూడా తన తండ్రి హత్య కేసు ఇంతవరకు తేలకపోవడం విచారకరం అని అన్నారు.
తమకే న్యాయం జరక్కపోతే ఇక సామాన్యుడి పరిస్థితేంటని ఆమె మీడియా ముందు వాపోయారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. హత్య గురించి వదిలేయాలంటూ చాలామంది తనకు సలహా ఇచ్చారని, కానీ తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని అన్నారు సునీతా రెడ్డి.