దొంగతనానికి బ్యాంకుకి వెళ్ళిన ఓ 40 ఏళ్ళ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. రెండు రోజులు బ్యాంకు సెలవులు కావడంతో తిండీతిప్పలు లేకపోవడంతో బ్యాంకులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాతి రోజు బ్యాంకు సిబ్బంది ఆమెను గుర్తించి చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఈ ఘటన షిల్లాంగ్ లో చోటుచేసుకుంది.విస్ బెల్లా అనే మహిళ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దీంతో దొంగదనం చేయాలని బ్యాంకుకి వెళ్ళింది. అయితే హడావుడి ఉండడంతో దొంగతనం చేయలేకపోయింది. రాత్రికైనా దొంగతనం చేద్దామని భావించిన ఆమె, సిబ్బంది కంటికి కనిపించకుండా సర్వర్ రూములోకి వెళ్ళి దాక్కుంది. తనవెంట సుత్తి, శానం, యాక్సా బ్లేడ్ వంటి సామాగ్రిని తీసుకెళ్ళింది.
బ్యాంకు సిబ్బంది వెళ్ళిపోయిన తర్వాత లాకర్లు ఓపెన్ చేద్దామని ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాకపోవడంతో… తెల్లవారగానే ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంది. అయితే మరుసటి రోజు రెండో శనివారం, తర్వాతి రోజు ఆదివారం కావడంతో… బ్యాంకు తెరవలేదు. దీంతో రెండు రోజుల పాటు అన్నపానీయాలు లేక అలమటించి స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు బ్యాంకు సిబ్బంది వచ్చి చూస్తే, స్పృహలో లేని విస్ బెల్లా కనిపించింది. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె కోలుకున్న తర్వాత బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన కోసం వచ్చిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.