పెళ్లైన నెల రోజులుకే భార్య గొంతు కోసిన భర్త..

    0
    894

    అనుమానం పెనుభూతమైంది. పెళ్లైన 28రోజులకే అనుమానంతో భార్య గొంతుకోశాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేకర్చాడు. ఆ తర్వాత తానూ గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్‌ బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది.
    కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లికి చెందిన సుధారాణి, కిరణ్‌కుమార్‌ ప్రేమించుకొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 27న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల కిందట నిజాంపేట పరిధిలోని ప్రగతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు.

    తమ కుమార్తెను చూడటానికి శనివారం సాయంత్రం 4 గంటలకు సుధారాణి తల్లిదండ్రులు వచ్చారు. పలుమార్లు తలుపులు తట్టినా ఎంతకూ తీయలేదు. కుమార్తె, అల్లుడికి ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి 7గంటల సమయంలో ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. బెడ్‌రూంలో సుధారాణి రక్తపుమడుగులో మృతిచెంది కనిపించింది. ఆమె మెడపై, శరీర భాగాల్లో బ్లేడుతో కోసిన గాయాలున్నాయి. ఊరినుంచి వచ్చే ముందు తమ కుమార్తెకు ఫోన్‌ చేశామని..‘మీరు బయలుదేరారా.. త్వరగా రండి..’అని గద్గద స్వరంతో చెప్పిందని..తల్లిదండ్రులు వాపోయారు. సుధారాణి చనిపోయిన గదిలోని బాత్‌రూంలో కిరణ్‌కుమార్‌ సైతం గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేశాక ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని భావిస్తున్నారు.

    వారం రోజులకే మొదలైన వేధింపులు
    వివాహమైన వారం నుంచే అనుమానంతో సుధారాణిని కిరణ్‌కుమార్‌ వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ సారి గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇరు కుటుంబాలు పంచాయతీపెట్టి సముదాయించి వారం క్రితమే హైదరాబాద్‌కు కాపురానికి పంపినట్లు బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్‌ గతంలో పలుమార్లు సైకోలా ప్రవర్తించేవాడని సుధారాణి బంధువులు పేర్కొంటున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.