విజయవాడ సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషంలో ఎరువుల దుకాణాలు తనిఖీ చేసి , అధికధరలు , ఎరువుల బ్లాక్ మెయిల్ బండారాన్ని బట్టబయలు చేశారు. మధాహ్నం సమయంలో లుంగీ కట్టుకొని , ఒక బైక్ లో కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్ ప్రాంతంలోని ఎరువుల దుకాణానికి వచ్చాడు. దుకాణం ఓనర్ ని యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. అతడు స్లిప్ రాసి గోడౌన్ కి పొమ్మన్నాడు,.అక్కడ అధికధరలు డిమాండ్ చేశారు.
రెండు బస్తాలు కొని బ్యాగ్ పై వేసుకొని మళ్ళీ దుకాణానికి వచ్చాడు. ఎక్కువధరలు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీసాడు. వెంటనే దుకాణాన్ని సీజ్ చేయించారు. అక్కడనుంచి ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు.
అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్లో తనిఖీ చేయగా గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు.