ఏటీఎం మిషన్లో డెబిట్ కార్డ్ ఇరుక్కుపోవడం ఎప్పుడైనా చూశారా..? కాసేపు కార్డ్ ఇరుక్కుపోతేనే బయట ఉన్న మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏటీఎం మిషన్లో ఓ దొంగ ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక, లోపల ఉండలేక భయపడిపోయాడు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ దొంగను బయటకు తీసి స్టేషన్ కి తీసుకుపోయారు.
తమిళనాడులోని కోయంబత్తూరు, అనియాపురంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో ఈ దొంగతనం ప్రయత్నం జరిగింది. బీహార్ కి చెందిన ఉపేంద్ర రాయ్ అనే వ్యక్తి తమిళనాడులో కోళ్లదాణా కంపెనీలో పనిచేసేవాడు. అయితే అర్థరాత్రి తప్పతాగిన ఉపేంద్రరాయ్ కి ఏటీఎం ని కొల్లగొట్టాలనే ఆలోచన వచ్చింది. అదే తడవుగా ఏటీఎం సెంటర్లో దూరాడు. ఏటీఎం వెనక డబ్బులుంటాయి, ముందునుంచి అందరూ తీసుకుంటారు అనే ఉద్దేశంతో ప్లైవుడ్ తొలగించి ఏటీఎం వెనక్కి వెళ్లాడు. అయితే అక్కడ అతనికి డబ్బులు తీసుకోవడం వీలు కాలేదు. ఎలాగోలా తప్పించుకుని ముందుకు రావాలనుకున్నాడు కానీ ఆ చిన్న సందులో ఇరుక్కుపోయాడు. తీరా తెల్లారైంది. కొంతమంది కస్టమర్లు ఏటీఎం సెంటర్లోకి వచ్చే సరికి మనోడు బయటకు రావడానికి ఆపసోపాలు పడుతున్నాడు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.