ఇదో చిత్రవిచిత్రమైన కేసు. 1995లో పెళ్ళి… పెళ్ళయిన నాలుగు రోజులకే ఇల్లరికం రమ్మని భార్య పోరు… తల్లిని వదిలి రానని భర్త… చివరకు విడాకుల కోసం కోర్టుకు… పదేళ్ళ క్రితం విడాకులు… అయినా భరణం కోసం సుప్రీంకు వెళ్ళిన భార్య… చీవాట్లు పెట్టిన న్యాయస్థానం. ఇదీ టూకీగా చెప్పాలంటే…
వివరాల్లోకి వెళితే… 1995లో ఓ జంటకు పెళ్ళయింది. ఐఏఎస్ కూతురుతో ఓ యువకుడికి వివాహం జరిగింది. పెళ్ళయిన నాలుగు రోజులకే తనతో పాటు ఇంటికి రావాలని, ఇల్లరికం వచ్చేయాలని భార్య డిమాండ్ చేసింది. తన తల్లిని వదిలి రానని ఆ భర్త తెగేసి చెప్పాడు. కొంతకాలం ఇలాగే కాలం వెళ్ళదీశారు. చివరకు అగర్తల హైకోర్టుకు విడాకుల కోసం దరకాస్తు చేసుకున్నారు. పదేళ్ళ క్రితం వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. అయితే తనకు భరణం కావాలంటూ ఆ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిన్న ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇద్దరికీ తలంటేసింది. ఇప్పుడు అతనికి 55, ఆమెకి 50 సంవత్సరాలు. కాపురం చేయకుండా భరణం ఎలా అడుతావంటూ భార్యను ప్రశ్నించింది. ఈ వయసులో మీరేం చేస్తారు అంటూ నిలదీసింది. ఇప్పుడీ కేసును విచారించాల్సిన అవసరం ఏముంది అని చీవాట్లు పెట్టి, కేసును కొట్టివేసింది. న్యాయమూర్తులు ఎమ్మార్షా, బొప్పన్నలు ఈ కేసును విచారించారు.