మూడేళ్ళ క్రితం రాజస్థాన్ ఎడారిలోని ఓ అడ్వేంచర్ రేస్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇంటర్నేషనల్ డెసర్ట్ బైక్ రేసర్ అస్బాక్ మాన్స్ మృతి కేసు వీడింది. ఇది సహజ మరణం కాదు… హత్య అని పోలీసులు తేల్చారు. కేరళకు చెందిన అస్బాక్ మాన్స్, సుమేరా భార్యభర్తలు. వీరు కొన్నాళ్ళు దుబాయ్ లోనూ జీవించారు. ఆ తర్వాత బెంగుళూరులో స్థిరపడ్డారు. డెసర్ట్ బైక్ రేసర్ గా ఇంటర్నేషనల్ లెవల్లో అస్బాక్ కు గుర్తింపు ఉంది. మూడేళ్ళ క్రితం రాజస్థాన్ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో ఇండియా బజ మోటార్స్ స్పోర్ట్స్ డక్కెన్ చాలెంజర్స్ అడ్వెంచర్ ర్యాలీలో అస్బాక్ పార్టిసిపేట్ చేయాల్సింది. కానీ ఆ ముందురోజే అతను అక్కడే చనిపోయాడు. డీహైడ్రేషన్ తో చనిపోయాడని పోలీసులు, కుటుంబసభ్యులు భావించారు. దాంతో అప్పుడు ఆ కేసు అలా ఉండిపోయింది. అయితే సుమేరా మీద అస్బాక్ సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఇది హత్య అని పోలీసులు తేల్చారు. అస్బాక్ ను హత్య చేసింది సంజయ్ అని గుర్తించారు. వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉండడమే హత్యకు కారణమని నిర్ధారించారు.
జైసల్మేర్ లోని అడ్వంచర్ ర్యాలీ జరిగే ప్రాంతానికి ముందు రోజు అస్బాక్ తో పాటు భార్య సుమేరా వెళ్ళారు. వీరితో పాటు అస్బాక్ స్నేహితులు సంజయ్, విశ్వాస్, నీరజ్, సంతోష్, సాబిక్ కూడా తోడు వెళ్ళారు. ర్యాలీ ట్రాక్ ను పరిశీలించారు. ఆ ప్రదేశంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా పని చేయవు. దీంతో ఇతరులకు సమాచారం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇదే అదనుగా భార్య సుమేరా, సంజయ్ లు అస్బాక్ గొంతు నులిమి హత్య చేశారు. అయితే డీహైడ్రేషన్ కారణంగా, ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయాడని కుటుంబసభ్యులను నమ్మించారు. అస్బాక్ సోదరుడు అనుమానం వ్యక్తం చేయడంతో నిజాలు వెలుగుచూశాయి. సుమేరాతో అస్బాక్ కి మనస్పర్ధలు ఉండేవని, తరచూ గొడవ పడేవారని పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే ఆమె సంజయ్ తో అక్రమసంబంధం పెట్టుకుందని, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని చెప్పారు. ప్రధాన నిందితులైన సుమేరా, సంజయ్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. మూడేళ్ళ తర్వాత ఈ మర్డర్ మిస్టరీ వీడింది.