మహీంద్రా XUV 500 కారు అమ్ముతామంటూ బెంగళూరు కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఓల్ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి మంజు అనే ఓ వ్యక్తి ఆ కారు కొంటానంటూ ముందుకొచ్చాడు. వస్తూ వస్తూ 10వేల రూపాయలు చేతిలో పట్టుకుని వచ్చాడు. రాగానే కారు ఓనర్ కి అది అడ్వాన్స్ కింద ఉంచమని చెప్పాడు. పది వేలు అడ్వాన్స్ ఇచ్చే సరికి అతను కూడా మంచి బేరం దొరికిందని సంబరపడ్డాడు. కారు కొనడానికి వచ్చిన మంజు టెస్ట్ రైడ్ చేసి వస్తానంటూ కారు తాళాలు తీసుకున్నాడు. అంతే ఆ తర్వాత కారు ఎక్కి ఇక మళ్లీ తిరిగి రాలేదు.
అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు అని ఎదురు చూసిన శివకుమార్ చివరకు మోసం గ్రహించాడు. టెస్ట్ రైడ్ పేరుతో మంజు కారు కొట్టేశాడని అర్థమైంది. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నెలమంగల పట్టణ పోలీసులు మంజుని అరెస్ట్ చేశారు.