మేనబావని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అత్తతో అడ్జస్ట్ కాలేకపోయింది. అటు భర్తను ఇబ్బంది పెట్టలేక, ఇటు అత్తపోరు భరించలేనంటూ.. ఆత్మహత్య చేసుకుంది. తన కడుపులో మరో ప్రాణం ఉందని తెలిసి కూడా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ వ్యవహారాన్ని బయటకు రానీయకుండా గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ దుబ్బ ప్రాంతానికి చెందిన యువతి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ కు చెందిన సొంత మేనత్త కుమారుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పడంతో కుటుంబీకులు వారికి 2020 జూన్ 16న వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి.
ఇటీవల ఆ కుటుంబంలో కలతలు ఏర్పడి మేనత్త సదరు గర్భిణిని సూటిపోటి మాటలతో వేధించడం ప్రారంభించింది. ఈ క్రమంలో గర్భిణి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడగా.. ఇంటి వద్ద జారిపడి మృతి చెందిందని అంత్యక్రియలు పూర్తి చేశారు. కుమార్తెను పోగొట్టుకున్న గర్భిణి తల్లిదండ్రులు సైతం ఫిర్యాదుకు వెనకడుగు వేయడంతో గుట్టు చప్పుడు కాకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. రెండు కుటుంబాల వారు రక్త సంబంధీకులు కావడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి రాలేదు. అయితే.. ఆత్మహత్యకు పాల్పడే ముందు గర్భిణి రాసిన లేఖ బయటపడటంతో అసలు విషయం వెలుగుచూసింది.