జులై 1నుంచి ఏపీలో స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కోవలం టీచర్లు మాత్రమే స్కూల్స్ కి వస్తున్నారు. వారు కూడా రోజు విడిచి రోజు కేవలం 50శాతం మంది మాత్రమే హాజరవుతున్నారు. వారం రోజుల తర్వాత పిల్లల పేరెంట్స్ ని స్కూల్స్ కి పిలిపించి వారికి వర్క్ షీట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది విద్యాశాఖ. అదే సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షల విషయం ఓ కొలిక్కి వచ్చింది కాబట్టి విద్యార్థులకు మార్కులు కూడా త్వరలో ప్రకటించబోతున్నారు.
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని…మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని… ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని… ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు.
క్లాసులు నిర్వహించని నేపథ్యంలో 70 శాతం ఫీజులు తీసుకోవాలని ఆదేశించామని… రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సంవత్సరం ఫీజులు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.దాని ప్రకారం ప్రవేటు స్కూల్స్ లో ఫీజులు నిర్ణయిస్తామన్నారు. కాగా.. ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడవంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.