దసరా పర్వదినాల్లో మైసూర్ లో జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. రాజుల కాలం నుంచి ఈ ఉత్సవాల్లో మైసూర్ మహారాజు ఆశీనులై నిర్వహించే దర్బార్ కు ఒక ప్రత్యేక విశిష్టత కూడా ఉంది. మైసూర్ దసరా ఉత్సవాల గురించి తెలుసినా, ఈ దర్బార్, సింహాసనం వెనక ఉన్న ప్రత్యేకత గురించి కొద్దిమందికే తెలుసు. మైసూర్ సంస్థానంలోని రాజులు ఈ సింహాసనం ఆశీనులై పాలించారు. మంత్రులు, సేనాధిపతులు, సన్నిహితులతో కలిసి దర్బార్ నిర్వహించేవారు.
గత వైభవాలకు చిహ్నంగా నేటికీ ఆ సంప్రదాయాన్ని మైసూర్ రాజవంశస్తులు కొనసాగిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో రాజు, మంత్రులు, సేనానులతో కలిసి… అలనాటి వైభవాన్ని తలపించేలా, రాచరికపు వేషధారణతో దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక రాజు ఆశీనులై ఉండే బంగారు సింహాసనానికి గొప్ప చరిత్రే ఉంది. ఈ బంగారు సింహాసనానికి పైన బంగారు గొడుగు ఉంటుంది. ఏనుగు దంతాలతో అలంకరించిన ఈ సింహాసనంలో వజ్రాలు, కెంపులు, వైఢూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు పొదిగి ఉంటాయి.
సింహాసనంలో రాజు కూర్చునే స్థానంలో కూడా విలువైన జాతిరత్నాలు పేర్చి ఉంటాయి. ఈ సింహాసనాన్ని స్వర్ణాలంకార నిపుణుడిగా పేరొందిన సింగనాచార్య రూపొందించాడని ప్రతీతి. రాజు సింహాసనం కింది నుంచి పైవరకు ఉండే మెట్లకి ఇరువైపులా సాలబంజికల వంటి ప్రతిమలు చెక్కి ఉంటాయి. సింహాసనానికి మూడువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు ఉంటాయి.
మరోవైపు గుర్రాలు, ఏనుగుల బొమ్మలు ఉంటాయి. సింహాసనానికి 8 దిక్కుల్లో చాముండేశ్వరీ, లక్ష్మీ, సరస్వతీ, అష్టదిక్పాలకుల బొమ్మలు ఉంటాయి. సింహాసనం వెనక పైభాగంలో మైసూర్ సంస్థానం చిహ్నమైన గండభేరుండ పక్షి ఉంటుంది. దానికింద సత్యమే ఉదాహరం (సత్యమేవ జయతే) కన్నడ లిపిలో రాసి ఉంటుంది. ఈ సింహాసనం రెండు మీటర్ల 25 సెం.మీ ఎత్తు ఉంటుంది. పైన బంగారు గొడుగు మొత్తం సింహాసనాన్ని కప్పి ఉంటుంది. సింహాసనంపై ఉన్న గొడుగుకు కూడా జాతిరత్నాలు పొదిగిఉంటాయి.
గొడుగు పైన బంగారు హంస వజ్రవైఢూర్యాలతో మెరుస్తూ ఉంటుంది. ఇలా ఈ సింహాసనాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. దసరా ఉత్సవాల్లో సింహాసనంపై కూర్చుని రాజు నిర్వహించే దర్బార్ ను చూసేందుకు ప్రపంచం నలుదిక్కుల నుంచి వేలాదిమంది సందర్శకులు వస్తారు.