కర్నాటక రాష్ట్రంలో మామిడి రైతులు విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా గతేడాదిలాగే, ఈఏడాది కూడా మామిడి రైతులు గిరాకీ లేక నష్టపోతున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా కొనుగోళ్లు లేకపోవడంతో పంటను రోడ్డుపై గుట్టలుగా పడేసి వెళుతున్నారు.
బేనీషా, తోతాపూరి వంటి రకరకాల మామిడి పండ్లకు కేంద్రమైన కోలార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో మామిడి పండ్లను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు మామిడిని ఎగుమతి చేసేవారు. అయితే ఈ ఏడాది మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతినడం, లాక్డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2019లో బేనీషా, తోతాపూరి వంటి మామిడి రకాలకు ఒక టన్ను లక్ష రూపాయలు పలికింది. 2020లో ఒక టన్ను 80వేలకు దిగింది. ఇక ఈ ఏడాది అయితే టన్నుకు ఏకంగా 10 నుంచి 15 వేల రూపాయలకు పడిపోయింది. అంటే కనీసం పంట ఖర్చుకు, రవాణా ఖర్చులకు కూడా రాలేనంతగా మార్కెట్ పడిపోయింది.
దీంతో కొనుగోళ్ళు లేక వందల టన్నుల మామిడిని రోడ్డు పక్కన పడేసి పోతున్నారు రైతులు. మామిడికి గిరాకీ పడిపోవడంతో దీన్ని ఆధారంగా చేసుకునే మామిడి పల్సింగ్ ఇండస్ట్రీలు కూడా మూతపడిపోయాయి.