కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏడాదీ తొలకరి వర్షాల తర్వాత ఇక్కడ వజ్రాలకోసం స్థానికులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాధికారులు కావొచ్చనే ఆశతో వారు ఈ ప్రయత్నం చేస్తారు. తాజాగా కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి ఆదివారం వజ్రం దొరికింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యాపారి రూ.6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.