ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ మారణహోమం ఒక రహస్యం. సముద్రంలో ఉండే బెర్ముడా ట్రయాంగిల్ పైన ప్రయాణించే ఏ విమానంగానీ, దానికి సమీపంలో పోతున్న నౌకలు గానీ, ఇంతవరకు కనిపించలేదు. కనీసం శిధిలాలు, శకలాలు కూడా దొరకవు. ఎన్ని విమానాలు పడిపోయాయో… ఎన్ని విమానాలు అదృశ్యమయ్యాయో… లెక్కేలేదు. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు.
సైన్స్ కి సమాధానం దొరకని ప్రశ్న. అలాంటిదే మన భారత్, బర్మా సరిహద్దుల్లో… తిరిగి రాలేని లోయ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. మన దేశానికి బర్మాకు సరిహద్దుల్లో పంగ్సావూ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఓ సరస్సు ఉంది. ఇప్పటివరకు ఆ సరస్సులో దిగిన వారెవరూ తిరిగి రాలేదు. లోపలికి వెళ్ళిన పడవలు కనిపించలేదు.
అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలోనే ఉన్న ఈ సరస్సు వద్దకు ఎవరినీ వెళ్ళవద్దని ప్రమాద సూచికలు పెట్టారు. టంగాస్ అనే గిరిజన తెగకు చెందిన వారు ఈ ప్రాంతంలో ఉంటారు. ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు. సరస్సు పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఏ ఒక్కరూ బతికి బట్టకట్టలేదు.
రెండో ప్రపంచ యుద్ధంలో వందల మంది జపాన్ సైనికులు ఆ ప్రాంతంలో చనిపోయారని, అందువల్ల వాళ్ళంతా దెయ్యాలై సరస్సులో ఉన్నారని, సరస్సు సమీపంలోకి వెళితే, వారు చంపేస్తారనేది అక్కడి ప్రచారం. నీరు తాగేందుకు వెళ్ళే పశుపక్ష్యాదులు కూడా బతికి బయటపడలేవు.