తమిళనాడు రాష్ట్రంలోని పుదుకొట్టాయ్ లో దారుణం చోటుచేసుకుంది. వరదనీటిలో చిక్కుకుని ఓ డాక్టర్ మృతి చెందింది. హోసూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో సి.సాథియా డాక్టర్ గా పనిచేస్తోంది. పుదుకొట్టాయ్ కు వచ్చిన ఆమె, తన అత్తగారితో కలిసి హోసూరుకి బయలుదేరింది. తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో ఆమె మార్గమధ్యంలో తుడైయూర్ రైల్వే అండర్పాస్లోకి వెళ్లింది.
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ మార్గం మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది. ఈ విషయం తెలియని సాథియా ఆ మార్గంలోకి వెళ్లింది. కొంతసేపటికి దాదాపు పూర్తిగా నీటమునిగిన కారు కదలకుండా ఆగిపోయింది. దిక్కుతోచని స్థితిలో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. ఆయన అక్కడి స్థానికులకు ఫోన్ చేసిన పరిస్థితిని వివరించారు. అక్కడికి చేరుకున్న కొంతమంది సాథియా అత్తగారిని తొలుత బయటకి తీసి రక్షించగలిగారు. కానీ సాథియాను రక్షించేలోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇవీ చదవండి..