తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైనా సాయం కోరినా… లేదా తన దృష్టికి ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చినా… వెంటనే ఆయన ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు. అంతేకాదు తనను ట్యాగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా రిప్లయ్ కూడా ఇస్తుంటారు. అయితే రొటీన్ కి భిన్నంగా కేటీఆర్ ను ఓ వ్యక్తి ట్యాగ్ చేశాడు.
తోటకూరి రఘు అనే వ్యక్తి తాను జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానని తెలిపాడు. ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని తాను ఆర్డర్ చేస్తే, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఆ వ్యక్తి వాపోయాడు. జొమాటో వాళ్లు ప్రజలకు ఇలాగేనా సేవ చేసేది? అంటూ ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ.. దీనికి నన్నెందుకు ట్యాగ్ చేయడం బ్రదర్? ఈ విషయంలో నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అంటూ వెరైటీగా ప్రశ్నించారు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.