కోవిడ్ సంక్షోభం నేపధ్యంలో పెళ్ళికి 20 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించని ప్రభుత్వాలు బ్రాందీ షాపుల వద్ద వందల మందిని ఎలా అనుమతిస్తున్నాయని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. శుభకార్యానికి గుంపులుగా చేరడాన్ని ఒప్పుకోని మనం, ఆరోగ్యం చెడగొట్టే మద్యం షాపుల వద్ద ఎలా అనుమతిస్తున్నాయో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని అక్షింతలు వేసింది. కేరళలో మద్యం షాపుల నిర్వహణ చూసే బెవ్కో, బ్రాందీ షాపుల ముందు సామాజిక దూరం పాటించే ఆలోచన చేయడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని ఏ బ్రాందీ షాపు ముందు చూసినా జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా గుంపులుగా ఉండడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీసింది. ముందు బ్రాందీ షాపుల వద్ద గుంపులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.