పెట్రోలు రేటు సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. ఈ దశలో పెట్రోలు వాడకాన్ని ఎవరూ తగ్గించలేరు కానీ, కనీసం మైలేజీని పెంచుకోవడంపై దృష్టిపెడితే.. ఆ భారం కాస్త తగ్గుతుంది. ఇప్పటి వరకూ మీ బైక్ ని ఎలా వాడినా పర్వాలేదు, ఇకపై మాత్రం కాస్త జాగ్రత్తగా వాడితే కండిషన్లో ఉండి మైలేజీ పెరుగుతుంది. దీనికోసం ఈ కింది టిప్స్ పాటించండి చాలు.
బైక్ కొనుగోలు చేసే సమయంలో లీటర్ కి 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీలు చెబుతున్నా అది వాస్తవం కాదు. చాలా బైక్ లు లీటర్ కు కనీసం 40 కిలోమీటర్ల మైలేజీని కూడా ఇవ్వవు. పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ లో అది మరింత దిగజారిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి. మైలేజీని ఎలా పెంచుకోవాలి.
– ఇంజిన్ ఆయిల్ తరచూ చెక్ చేసుకోవాలి. మంచి బ్రాండెడ్ ఇంజిన్ ఆయిల్ నే వాడాలి. మార్కెట్ లో తక్కువ ధరకే లభిస్తుందని నాణ్యత లేని వాటిని వాడితే అది మీ బైక్ ఇంజిన్ పాడైపోతుంది జాగ్రత్త.
– చాలా మంది బిజీ వర్క్లో పడి రెగ్యులర్ సర్వీసింగ్ ని మరచిపోతుంటారు. బైక్లో ఏదైనా సమస్య తలెత్తితే తప్ప సర్వీసింగ్ చేయించరు. అలా కాకుండా రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించాలి.
– స్పీడ్ లిమిట్ తప్పనిసరి. పరిమిత వేగంతో వెళ్తేనే బైక్ అయినా, కార్ అయినా మంచి మైలేజీ ఇస్తాయి. ఎకానమీ లిమిట్ ఇచ్చిన మేరకు స్పీడ్ లిమిట్ లో వెళ్లాలి. ఓవర్ స్పీడ్ తో వెళ్తే మంచి మైలేజీ రాదు.
– రెగ్యులర్ సర్వీసింగ్ చేయిస్తున్నప్పటికీ బైక్ సరైన మైలేజీ ఇవ్వకపోతే.. కార్బురేటర్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కార్బురేటర్ పనితీరును గమనిస్తూ రీ ట్యూనింగ్ చేయించాలి.
– టైర్లలో సరైన పరిమాణంలో గాలి ఉండేలా చూసుకోవాలి. లాంగ్ రైడ్ లకు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేసేముందు టైర్ ప్రెజర్ ను గమనించాలి.
– బైక్ విడిభాగాలు పాడైపోతే కచ్చితంగా కంపెనీ భాగాలనే అమర్చాలి. డూప్లికేట్ కంపెనీల పార్ట్ లు వాడితే మాత్రం మైలేజీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
– ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సి అవసరం వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసి ఉంచాలి. తద్వారా మైలేజీ పెరుగుతుంది. 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేయడమే మంచిది.
– బైక్ను కూడా ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేస్తే.. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు ఆవిరైపోతాయి. తద్వారా, ఇంజిన్ కెపాసిటీతో పాటు మైలేజీ తగ్గే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు బైక్ ను నీడలోనే పార్క్ చేయాలి.