ఓ అమ్మాయి , ప్రేమ పెళ్లి పేరుతొ అబ్బాయిని ఎంతగా వేధించిందీ అంటే, అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయేంతగా.. ఒకరకంగా ఆ అమ్మాయి శాడిస్ట్.. మూడుపేర్లతో , మూడు నంబర్ల నుంచి , మూడు గొంతులు మార్చి , ఏమార్చి చివరకు అతడి ప్రాణం బలితీసుకుంది.. సందీప్కుమార్ అనే యువకుడు మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. తన చెల్లెలు ఫ్రెండ్ స్రవంతి ఫోన్లో పరిచయమైంది. ఇద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు చెప్పింది.
ఆమే మరో ఇద్దరు అమ్మాయిల్లాగా కావ్య, మనీషా అంటూ ఇతర నంబర్లతో నంబర్లతో ఫోన్ చేసేది. ముగ్గురు అమ్మాయిల మాదిరి వ్యవహరిస్తూ నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని విసిగించేది. ఇలా అతడితో ప్రతి రోజూ ట్రయాంగిల్ లవ్ గేమ్ ఆడింది.ఇలా మాట్లాడే క్రమంలో సందీప్.. తాను మొదట పరిచయమైన స్రవంతినే ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఈ క్రమంలో స్రవంతికి పెళ్లి అయ్యింది. అంతటితో వదల్లేదు. ఆమె మిగతా ఇద్దరిలాగా ఫోన్లో సందీప్తో మాట్లాడుతూనే ఉంది. మనీషా పేరుతో ఫోన్ చేస్తే.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. నన్ను పెళ్లి చేసుకో అనేది. కావ్య పేరుతో ఫోన్ చేసినప్పుడు కూడా అలాగే అనేది. అయితే సందీప్ తాను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమె పెళ్లయిపోయింది కాబట్టి ఇక ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు.
ఆరు నెలలు ఇలానే గడిచాయి. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి తమను ప్రేమించకపోయినా పర్వాలేదుకానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరు పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది. అయితే సందీప్.. తాను గతంలో ప్రేమించానని, తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఆమెను ఎలా చేసుకుంటానని చెప్పేవాడు. అయినా నీ కోసమే భర్తను వదిలేసి వచ్చిందని, పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్లో మాట్లాడుతూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ ఈనెల 12న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు.
ఇవీ చదవండి..