గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఒక్కోసారి కొంప కొల్లేరయ్యి బురదలోకి తోస్తుంది. అలాంటిదే గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్న విదేశీ టూరిస్టులు పాపం బురదలో చిక్కుకున్నారు. దాదాపు 6 గంటల పాటు బురదలోనే అవస్థలు పడ్డారు. నగరాల్లో అయితే గూగుల్ మ్యాప్స్ సాయంతో సులభంగా గమ్యం చేరుకోవచ్చు. పల్లె ప్రాంతాల్లో అయితే ఇది కాస్త కష్టమైన పనే. జర్మనీ నుంచి ఉత్తరాఖండ్ వచ్చిన ఓ యాత్రికుల బృందం ఐ10 కారులో ప్రయాణం మొదలు పెట్టింది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ ప్రకారం ఉదయ్ పూర్ కు బయలుదేరారు. రాజస్థాన్ లోని నవానియా హైవేపై పోతుండగా మెనార్ అనే ఊరు వచ్చింది. అక్కడి నుంచి మట్టి రోడ్డులో పోతే త్వరగా ఉదయ్ పూర్ చేరుకోవచ్చునని సంకేతాలిచ్చింది. దీంతో జాతీయ రహదారి నుంచి మట్టిరోడ్డుకి మళ్ళారు . కొంచెం దూరం పోగానే రోడ్డు అద్వాన్నంగా ఉండి కారు బురదలో కూరుకుపోయింది. ఆ పల్లె ప్రాంతాల ప్రజలే ఈ రోడ్డును ఉపయోగించడం మానేశారు. బురదలో చిక్కుకున్న వీరిని చూసిన సమీప గ్రామస్తులు ఓ ట్రాక్టర్ ను తీసుకొచ్చారు. ట్రాక్టర్ సాయంతో దాదాపు 5 గంటల ప్రయత్నం తర్వాత ఆ కారు బయటకు వచ్చింది. గూగుల్ మ్యాప్స్ తో అంతా ఒకే అనుకుంటే ఇలా బురదలో కూరుకుపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పల్లె ప్రాంత ప్రయాణాలు.