కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుత్నిక్ -వి టీకాలతోపాటు.. ఇప్పుడు భారత్ లో పంపిణీ చేసేందుకు మోడెర్నా టీకాకు కూడా అనుమతి లభించింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్ అనుమతుల కోసం సిప్లా సోమవారం డీసీజీఐకి దరఖాస్తు చేయగా ఒక రోజు వ్యవధిలోనే అనుమతి మంజూరైంది. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది డీసీజీఐ.
మోడెర్నా టీకాను ఎం-RNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. క్లినికల్ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.