దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు అనేక రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో జులై 1 నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించబోతున్నారు. మరోవైపు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందించలేదు. పిల్లల వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది.
వ్యాక్సిన్ తర్వాతే స్కూల్ కి పిల్లలు..
వ్యాక్సినేషన్ తర్వాతే పిల్లల్ని స్కూల్ కి పంపితే మంచిదని చెబుతున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. భారత్ ఫైజర్, జైడస్ వ్యాక్సిన్లు ఆమోదం పొందితే చిన్నారులకు కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబందించిన డేటా సెప్టెంబర్ వరకు అందుతుందని, అనుమతులు పొందిన తరువాత వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.