కేజీ చికెన్ రేటు 300కి చేరుకుంటోంది. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. మరోవైపు డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడంతో రేట్లు పెరిగాయి. డిమాండ్కు తగినట్టు సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి.
రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
గత ఆదివారం స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 210 ఉండగా.. ఈ వారం ధర రూ. 260కి చేరుకుంది. వచ్చే వారానికి 208కి చేరే అవకాశం ఉందని అంచనా.. నెలాఖరులోకానీ, అంతకంటే ముందు కానీ.. చికెన్ రేటు 300కి చేరువ అవుతుందని చెబుతున్నారు.
సాధారణంగా ఎండా కాలంలో కోళ్లు ఎండలకు తట్టుకోలేవని.. వాటి నిర్వహణ భారమని చాలా వరకూ కోళ్ల ఫారాలను ఖాళీ చేస్తారు. చిన్న రైతులు, చిన్నమొత్తంలో పెంపకందారులు ఎండాకాలం నిర్వహణ భారమంటూ కోళ్ల పెంపకాన్ని ఆపేస్తారు. కోళ్ల దాణాకు అవసరమైన సోయా కేకు, ఇతర ముడిసరకు ధరలు 30-40 శాతం వరకూ పెరిగాయని పెంపకందారులు చెబుతున్నారు. కోళ్లకు తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయని.. ఇలా అనేక కారణాలతో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మే నెల నుంచి శుభకార్యాలు మొదలుకానున్న నేపథ్యంలో కోడి ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.