కరోనాతో చనిపోయిన వారికి 50వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే ఏర్పాట్లు రాష్ట్రప్రభుత్వాలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో కరోనాతో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ దాఖలైన ఓ పిటీషన్ పై కేంద్రం ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ కరోనా మృతుల కుటుంబాలకు 50వేల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించిందని కూడా తెలిపింది. కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు ఈ మొత్తం అందించే ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులను, రాష్ట్ర విపత్తుల నిధి నుంచి చెల్లిస్తాయని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ మరియు ఐసీఎంఆర్ నిబంధనల మేరకు, కరోనాతో చనిపోయినట్లు తగిన ఆధారాలు చూపిస్తే, ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు రీపక్ కన్సాల్, గౌరవ్ కుమార్ కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు చెల్లించాలంటూ గతంలో సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈనెల 3న సుప్రీంకోర్టు కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. కరోనా మూడో దశ ముంచుకొస్తున్నా, కరోనా మృతుల ఎక్స్ గ్రేషియా విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మార్గదర్శకాలు అందచేయాలని సుప్రీం కోరడంతో, కేంద్రం ఈ అఫిడవిట్ ను సమర్పించింది.
ఇవీ చదవండి..