మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో చిన్న అలజడి. మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు చైతన్యపై పోలీస్ కేసు నమోదైంది. ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమకి ఇబ్బందులు కలిగిస్తున్నారని నటి నిహారిక భర్త చైతన్యపై ఫిర్యాదు చేశారు. గతేడాది మార్చి నెలలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ నుంచి షేక్ పేట్ కు వెళ్లే దారిలో ఉండే ఓ అపార్ట్మెంట్ లో నిహారిక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పనుల కోసం ఈ ఫ్లాట్ ఉపయోగించుకునేవారు.
అయితే, జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెసిడెన్షియల్ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కొవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా ఫ్లాట్ లోకి వస్తున్నారని.. దానివల్ల తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నామని సదరు అపార్ట్మెంట్ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.