రక్షాబంధనానికి నిజమైన అర్ధం ఈ అక్కాతమ్ముడు. రాఖీలు కట్టడం, స్వీట్లు తినడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం రాఖీ పండుగ రోజున జరిగేవే అయినా, ఓ తమ్ముడు మాత్రం తన అక్కకు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. అది ఆమెకు ప్రాణం పోసింది. 25 ఏళ్ళ ఓ యువకుడు, 31 ఏళ్ళ తన సోదరికి కిడ్నీ దానం చేశాడు. హర్యానాలోని రోహ్తగ్లో ఆకాష్ హెల్త్ కేర్ ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఐదేళ్ళ నుంచి అతని అక్క కిడ్నీ వ్యాధితో బాధ పడుతోంది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చేది. క్రమంగా ఆమెకు క్షయ, గుండె జబ్బు కూడా వచ్చాయి. ఆమె పరిస్థితి విషమంగా మారింది.
ఆమెకు కిడ్నీ మారిస్తే తప్ప బతకదని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే భర్త కిడ్నీ ఆమెకు సరిపోకపోవడంతో వెంటనే ఆమె తమ్ముడు కిడ్నీ ఇస్తానని ఆస్పత్రికి వచ్చాడు. తమ్ముడి బ్లడ్ గ్రూప్ ఆమెకు సరిపోవడంతో, డాక్లర్లు ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేశారు. దాదాపు ఐదు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది. అక్కాతమ్ముడు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. రక్షాబంధన్ కి ఒక్కరోజు ముందు ఈ ఘటన జరిగింది. రక్తపాశం ఎంత బలీయమైందో ఈ ఘటనే ఓ నిదర్శనం. అక్కాతమ్ముడి అనుబంధానికి, రక్షాబంధానికి ప్రతీకగా నిలిచారు వీరిద్దరూ. జీవితకాలం తోడుగానే కాదు జీవితాంతం తన ప్రాణంగా అక్కను చూసుకునే తమ్ముడు దొరికాడు. ఇంతకంటే ఏం కావాలి.
ఇవీ చదవండి..