మన దేశంలో బ్యాంకులకు వెయ్యి రూపాయలు లోన్ ఎగ్గొడితే ఆ పేదవాడి బతుకు బస్టాండే. ఇంటికి వచ్చి రచ్చ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తారు. ఈ వేధింపులు పడలేక ఆత్మహత్యలు చేసుకున్న బాధితులు ఎందరో. అయితే గత నాలుగేళ్ళుగా కోటీశ్వరులకు బడా కంపెనీలు బ్యాంకులకు రద్దు చేసిన రుణాలు ఎంతో తెలిస్తే, ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే.
గత నాలుగేళ్ళలో కార్పోరేట్ కంపెనీలు కట్టకుండా ఎగవేసిన లేదా నిరర్ధకమైన ఆస్తులు పెట్టి దివాళా తీసేసిన కంపెనీల రుణాలను ఆరు లక్షల 96 వేల కోట్లను రద్దు చేశారు. అంటే దాదాపు 7 లక్షల కోట్లు అన్నమాట. 2017-18లో లక్షా 44వేల కోట్లు, 2018-19 లో 2 లక్షల 54వేల కోట్లు, 2019-20లో లక్షా 45వేల కోట్లు, 2020-21లో లక్షా 53వేల కోట్లు బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేశారు. దీన్ని బట్టి బ్యాంకులకు వేల లక్షల కోట్లు ఎగవేస్తున్న వారే పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వేల రూపాయల్లో బాకీలు ఉన్న పేదలు మాత్రం వేధింపులకు గురవుతున్నారు.