ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జులైలో జరిగే అవకాశం ఉందని ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే సీఎం జగన్ దే తుది నిర్ణయమని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆజిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తాజాగా సీఎం జగన్ తో జరిగిన సమీక్షలో అసలు పరీక్షలపై ఎలాంటి చర్చ జరగలేదని అంటున్నారాయన.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్ష జరిగింది. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సురేష్.. టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణపై స్పందించారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. పరీక్షలకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షలపై మొదటి నుంచి తమ వైఖరి ఒక్కటే అని మంత్రి వివరించారు.