ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కి పోలీసులు దారి వదలకపోవడంతో… అంబులెన్స్ లో ఉన్న మహిళ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్లోని కాన్సూరులో శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ నిన్న ఢిల్లీ నుంచి స్వస్థలమైన కాన్పూరుకి రైలులో వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళతారన్న సమాచారంతో పోలీసులు ట్రాఫిక్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదే సమయంలో కాన్పూర్ ఇండస్ట్రియల్ వింగ్ చైర్మన్ వందనా మిశ్రా అనారోగ్యం కారణంగా అంబులెన్స్ లో ఆస్పత్రికి వెళుతున్నారు. ఆమె ఇటీవలే కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నారు.
అయితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెను చికిత్స కోసం అంబులెన్స్ లో కుటుంబసభ్యులు తరలించారు. అయితే రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ను స్ధంభింపచేశారు. ఈ ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా చిక్కుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా నిలిపివేశారు. ఇలా దాదాపు రెండు గంటల పాటు అంబులెన్స్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. దీంతో వందనామిశ్రా చనిపోయారు.
ఈ ఘటన పట్ల కాన్పూర్ సిటీ పోలీస్ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని అంబులెన్స్ ని నిలువరించి తప్పిదం చేసిందని, ఇందుకు చింతిస్తూ ట్విట్టర్ లో బహిరంగ క్షమాపణ కోరింది. అంబులెన్స్ ను వదలని సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, వారిని ఇప్పటికే సస్పెండ్ చేశామని పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించామని తెలిపింది. మరోవైపు ఈ విషయం రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ దృష్టికి వెళ్ళడంతో ఆయన తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలకు హాజరై తన సానుభూతిని తెలపాలని అధికారులను ఆదేశించారు.