కడుపుకోతను మరచిపోవడం తల్లికి అంత త్వరగా సాధ్యమయ్యే పని కాదు, తల కొరివి పెట్టాల్సిన కొడుకు తమ కళ్లముందే చనిపోతే.. వారిని తలచుకుంటూ ఏళ్ల తరబడి ఏడుస్తూ కూర్చునే తల్లులు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. వారి ధ్యాసలోనే ఉంటూ, కుంగి, కృశించి తనువు చాలించే మాతృమూర్తుల ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే ఆ దశకు రాకుండానే కొడుకు జ్ఞాపకాల్లో ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన ఓ తల్లి మృతదేహంగా ఒడ్డుకు చేరింది.
తమిళనాడులోని కోవళం బీచ్ లో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు గుండు మేడుకు చెందిన వసంతి (42) కొడుకు గోకులన్ తో కలసి ఉండేది. గోకులన్ (21) స్థానికంగా ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ మోటారు సైకిల్ ప్రమాదంలో గోకులన్ మరణించాడు. ఒక్కగానొక కుమారుడు దూరం కావడంతో వసంతి ఒంటరి అయ్యారు. అతడి అస్తికల్ని ఇంట్లో ఫొటో వద్ద ఉంచి ప్రతి రోజూ పూజ చేస్తూ వచ్చారు. అయితే అస్తికల్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని బంధువులు ఆమెను వారించారు. అస్తికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు. దీంతో ఆమె అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు కోవళం బీచ్కు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు గాలించారు.
పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక జాలర్ల సమాచారం మేరకు ఆమె బిడ్డ అస్తికల్ని కలిపేందుకు వచ్చి చాలా సేపు సముద్రం ఒడ్డున ఏడుస్తూ కూర్చున్నారని ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయారని తెలిసింది. ఈ క్రమంలో ఆమె మృతదేహం ఒడ్డుకు చేరింది. కొడుకు అస్తికల్ని సముద్రంలో కలిపి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది.