ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంది. మొదటి ముగ్గురు భర్తలపై రకరకాల కేసులు పెట్టి, బెదిరించి, ముప్పుతిప్పలు పెట్టి.. విడాకులు తీసుకుంది. పెళ్ళిళ్ళ పేరుతో అందినకాడికి దోచుకుంటోంది. కోల్ కత్తా ఆలీపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
సోమాదాస్ అనే మహిళ… వృత్తిరిత్యా స్కూల్ టీచర్. 2011లో బిశ్వాస్ అనే వ్యక్తిని ఆమె పెళ్ళి చేసుకుంది. కొంతకాలం కాపురం సజావుగానే చేసిన ఆమె… ఆ తర్వాత భర్తపై, అత్తమామలపై గృహ హింస కేసు పెట్టింది. కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకుంది. కొన్నాళ్ళకు రాజు ముఖర్జీ అనే మరోవ్యక్తిని రెండో పెళ్ళి చేసుకుందామె. అతనిపై కూడా ఇలాంటి వేధింపుల కేసులే పెట్టి.. అతని నుంచి కూడా విడిపోయింది.
విడాకులు తీసుకుని… ఒరిస్సాకు చెందిన అశ్వనీ కుమార్ అనే వ్యక్తిని మూడో పెళ్ళి చేసుకుంది. అది కూడా కొన్నాళ్ళకు పెటాకులు చేసుకుంది. అశ్వనీకుమార్ సైన్యంలో పని చేస్తున్నాడు. అతనిపై, అతని కుటుంబసభ్యులపై వరకట్నం, గృహ హింస కేసులు పెట్టింది. అలా ముచ్చటగా మూడో భర్తతో కూడా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజీవ్ బిశ్వాస్ అనే లాయర్ను నాలుగో పెళ్ళి చేసుకుందా టీచర్. ఇద్దరు భర్తలతో వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని రెండు కోట్లు వెనకేసుకుంది. విడాకులు తీసుకున్న మరో భర్త ద్వారా ప్రతి నెలా భరణం పొందుతోంది సోమాదాస్.