మెట్ గాలా… సెలబ్రిటీలు డిజైనర్ వేర్ డెస్సుల్లో మెరిసిపోతూ కనిపించే అందమైన వేదిక. ఫండ్ రైజింగ్ కోసం చేసే మెగా ఈవెంట్ ఇది. ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుంది. అయితే కోవిడ్ కారణంగా సెప్టెంబర్ కి వాయిదా పడింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక వ్యక్తి మాత్రం సుధారెడ్డి.
సుధారెడ్డి సెలబ్రిటీకాదు. సినిమా స్టార్ అంతకంటే కాదు. హైదరాబాద్ కి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. ఫస్ట్ టైమ్ ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు సుధారెడ్డి. డిజైనర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ రూపొందించిన గౌన్లో సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. ఆర్ట్, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టపడే సుధారెడ్డి ఇలా ఫస్ట్ టైమ్ ఓ అంతర్జాతీయ వేదికపై కనిపించడం విశేషం.
గతంలో ఇండియా నుంచి ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోణె, ఇషా అంబానీ వంటి వాళ్లు మెట్ గాలాలో సందడి చేశారు. తొలిసారి హైదారాబాద్ నుంచి సినిమాలకు సంబంధం లేని సుధారెడ్డి మెట్ గాలా రెడ్కార్పెట్పై కనువిందు చేశారు.
మెట్ గాలా అంటే?
మెట్ గాలాను మామూలుగా మెట్ బాల్ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అనే మరో రెండు పేర్లూ ఉన్నాయి. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. వాస్తవానికి ఇదో ఫండ్ రైజింగ్ (నిధుల సేకరణ) ఈవెంట్.
న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా ఏటా ‘మే’లో ‘మొదటి సోమవారం’ ఈ ‘మెట్ గాలా’ను నిర్వహిస్తుంటారు. 1948లో మొదలైన ఈ ఈవెంట్ నిర్విరామంగా కొనసాగుతోంది.
నిజానికి ఈ ఏడాది మేలోనే జరగాల్సిన ప్రోగ్రామ్.. కరోనా కారణంగా ఇన్ని నెలలు వాయిదా పడింది. నిన్న మొదలైంది. ఇంకో విషయం తెలుసా.. 2019లో జరిగిన ఈవెంట్ కోసం ఒక్క ఎంట్రీకి 30 వేల డాలర్ల ఫీజును పెట్టారట!