మెడికల్ సీట్ కోసం రాసే నీట్ ఎగ్జామ్.. విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. రోజల వ్యవధిలో తమిళనాడులో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షకు సరిగ్గా ఒకరోజు ముందు సేలం లోని ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు అరియలూరు జిల్లాలో కనిమొళి అనే ఓ అమ్మాయి నీట్ పరీక్ష సరిగా రాయలేదని ప్రాణం తీసుకుంది. కనిమొళి తండ్రి అడ్వొకేట్. పరీక్ష సరిగా రాయలేదని ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో వారు పర్వాలేదని ఆమెను సముదాయించి వేరే ఊరిలో ఓ శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ఇంటికొచ్చి చూసే సరికి కనిమొళి చనిపోయి ఉంది.