వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనంటూ చాలా సార్లు టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే అప్పటికప్పుడే వాటికి కౌంటర్లు ఇచ్చారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో వాలంటీర్లు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ తరపున గెలిచారు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. గురుదాసుపురం పంచాయితీకి చెందిన నలుగురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీకి చెందిన నలుగురు గ్రామ వాలంటీర్లు గిరి, ఢిల్లీ, చైతన్య, రమేష్లు తమ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పలాస టీడీపీ ఇన్చార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇదికాక ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతోనే ఇలా వాలంటీర్లు సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వేపు చూస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు.