ఎస్ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన
టీడీపీ, బీజేపీ, జనసేన
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
ఎన్నికల సంఘం ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుందని, అందుకే ఆ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రకటించాయి. గురువారం సాయంత్రం సమావేశ ఆహ్వానం పంపిన ఎస్ఈసీ.. రాత్రి ఎన్నికల తేదీలను ప్రకటించడం, పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తామని నిర్ణయించడం అప్రజాస్వామికమని ఆయా పార్టీల నేతలు విమర్శించారు. జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారపార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అన్నారు పవన్.