పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు పెట్టుకునే సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టపడి సెక్స్ వర్కర్ల వద్దకు సెక్స్ కోసం వెళితే… దానికి వారు ఇష్టపడి అంగీకరిస్తే.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలని పోలీసులకు సూచనలు చేసింది. వ్యభిచారం అనేది అనాదిగా వస్తున్న ఓ వృత్తి అని, ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు గౌరవానికి భంగం కలగకూడదని, చట్టం ముందు అందరూ సమానులే అన్న సహజ న్యాయసూత్రం వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ముగ్గురు సభ్యులున్న ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్న రాజ్యాంగం ప్రకారం రక్షణ అనేది ఈ దేశంలో అన్ని వృత్తుల వారికి వర్తిస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే అనైతిక కార్యకలాపాల చట్టం 1956 ప్రకారం నడుచుకోమని సలహా ఇచ్చింది. క్రిమినల్ చట్టం అన్ని కేసుల్లోనూ వయసు, ఎదుటి వ్యక్తి అంగీకారం బట్టి పోలీసులు వ్యభిచారులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉండాలని చెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రతి పౌరుడికీ గౌరవంగా బతికే హక్కు ఉందని ఉద్ఘాటించింది. కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, కడగండ్లపై దాఖలైన ఓ పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కరోనా కాలంలో అందరినీ ఆదుకుని, కేవలం సెక్స్ వర్కర్లను మాత్రమే వదిలేశారని ఆ పిటీషన్లో పేర్కొన్నారు.
మహిళల మీద లైంగిక దాడులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. సెక్స్ వర్కర్ల పట్ల కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తగు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ప్రతి జిల్లాలో ఉండే జిల్లా న్యాయసేవాధికార సంస్థలు సెక్స్ వర్కర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని, అవసరమైతే సంరక్షణ కేంద్రాల్లో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.