కొత్త మంత్రివర్గం మరొక 12 రోజుల్లో కొలువు తీరనుంది. ఈనెల 11 నాటికి సీఎం జగన్.. నూతన మంత్రులతో కొలువు తీరనున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి ఉగాది తర్వాత రాజీనామాలు తీసుకుంటారని చెబుతున్నారు. రాజీనామాలు సమర్పించేందుకు మంత్రులు కూడా సిద్దంగానే ఉన్నారు. మీరు రెండున్నరేళ్లు మాత్రమే మంత్రులని సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం తెలిసిందే..
8వ తేదీన సీఎం జగన్.. గవర్నర్ తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆరోజునే మంత్రివర్గ సంభ్యుల రాజీనామాలను గవర్నర్ కు సమర్పిస్తారు. అదేరోజున కొత్త మంత్రుల జాబితాను కూడా అందజేస్తారని చెబుతున్నారు. 11వ తేదీన ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. కులాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఇద్దరిని మాత్రం మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, వారిద్దరి చేత కూడా రాజీనామాలు తీసుకుని.. మళ్ళీ ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ విషయం ఇటీవల జరిగిన కాబినెట్ సమావేశంలో కూడా సీఎం సూచన ప్రాయంగా చెప్పారు. రాజీనామాలకు మంత్రులందరూ కూడా మానసికంగా సిద్ధమైపోయారు. మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం మహిళా మంత్రులు ఉన్న జిల్లాల్లో.. ప్రత్యామ్న్యాయంగా ఇతర జిల్లాల్లో మంత్రులకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. కొత్త మంత్రివర్గం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారని చెబుతున్నారు. విషయ పరిజ్ఙానం, సమస్యలపై ఆవగాహన, క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసే అనుభవం కలిగిన వారిని మంత్రులుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.