హైదరాబాద్ లో మాయమాటలతో కిట్టీ పార్టీలు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్న శిల్పా చౌదరి పోలీసులకు కూడా లొంగడం లేదు. రెండు సార్లు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించినా కన్నీళ్ళు, దొంగమాటలు తప్ప, పెదవి విప్పి నిజం చెప్పడం లేదు. రియల్ ఎస్టేట్ పేరుతో దాదాపు వంద కోట్లకు పైగా దోచేసిన శిల్పాపై ఇప్పుడిప్పుడే ఫిర్యాదు చేసేందుకు సంపన్నులు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే శిల్పాపై ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురిలో ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిని. ఈమె హీరో మహేష్ బాబుకి చెల్లెలు. హీరో సుధీర్ బాబుకు సతీమణి. ఆమె ఒక్కటే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది. శిల్పాచౌదరిపై ఆమె ఫిర్యాదు చేసింది.
మరో మహిళ వ్యాపారవేత్త అయిన దివ్యారెడ్డి. శిల్పాకు కోటి 5 లక్షలు ఇచ్చింది. నార్సంగికి చెందిన మరో మహిళ మూడు కోట్ల పది లక్షలు ఇచ్చింది. మరో బాధితురాలు 11 కోట్లు ఇచ్చిందని, అయితే ఆమె ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. పోలీసుల విచారణలో టంగుటూరి రాధికారెడ్డికి ఆరు కోట్లు ఇచ్చానని శిల్పా చౌదరి చెప్పింది. పోలీసులు ఆమెను విచారించగా తన దగ్గరే శిల్పాచౌదరి అప్పు తీసుకుందని, ఆమె చెప్పేదంతా అబద్దమని, శిల్ప ఇచ్చిన చెక్కులు, ప్రామిసరీ నోట్లను చూపించింది. శిల్పాచౌదరి పోలీసుల విచారణకు కూడా లొంగకపోవడంతో ఆమె బినామీలు ఎవరో, ఆమె ఆస్తులు ఎవరి పేరున ఉన్నాయో తెలుసుకోవాలని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. శనివారంతో ఆమె కస్టడీ ముగియడంతో తిరిగి చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు.