మాయ మాటలతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోల భార్యలకు, పారిశ్రామిక వేత్తలకు, సంపన్నులకు వల వేసి దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా దండుకున్న శిల్పా చౌదరి, ఆమె భర్తను హైదరాబాద్ లోని నార్సంగి పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో పార్టీల ఆంటీగా పేరున్న శిల్పాచౌదరి, మాయ మాటలతో ఎర వేయడంలో మహాదిట్ట. ఇంటికి పార్టీలంటూ పిలిచి ఏవేవో వ్యాపారాల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంది. తమ బంధువులకు చెందిన ఒక విద్యాసంస్థలో పెట్టుబడులు పెట్టాలని మరికొంతమంది నుంచి డబ్బులు దండింది. రియల్ ఎస్టేట్ పేరుతో ఇంకొంతమందికి వల వేసి అప్పుల పేరుతో డబ్బులు తీసుకుంది.
మరికొంతమంది మహిళల నుంచి నగలు కూడా కుదువ పెట్టించి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇన్ని మోసాలు ఇంతకాలంగా యధేశ్చగా చేసుకుంటూ వచ్చి శిల్పాచౌదరి కేవలం పార్టీల పేరుతోనే ఎర వేయడం విశేషం. అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చి కొంతమంది వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంది. అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. ఇటీవల కొంతమంది ప్రముఖులు, వారిలో ఒక హీరో, అతని భార్య కూడా ఉన్నారని, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మరింతమంది నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో వీటిపై కూడా కేసులు నమోదు చేస్తామని నార్సంగి పోలీసులు తెలిపారు.