విశాఖపట్నం జిల్లా మధురవాడలో పెళ్ళి పీటల మీదనే కుప్పకూలి చనిపోయిన సృజన కేసులో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. సృజన విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని, అది కూడా గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారణ అయింది. పెళ్ళికి మూడు రోజుల ముందుగానే తన ప్రియుడు పరవాడకు చెందిన మోహన్కు తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, ఎలాగైనా తనను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోవాలని కోరింది.
పెళ్ళికి గంటల ముందు కూడా ప్రియుడు మోహన్తో ఇన్ స్టా గ్రామ్లో సృజన చాటింగ్ చేసింది. తనకు ఈ పెళ్ళి జరిగితే బతకాలని ఇష్టం కూడా లేదని, ఎలాగైనా తనను కాపాడుకోమని కోరింది. పెళ్ళి సమయానికి రమ్మని, పెళ్ళి అప్పటివరకు ఆపేందుకు ప్రయత్నిస్తానని కూడా చెప్పింది. అయితే ప్రియుడు మోహన్ ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించాడు. తాను ఇంకా ఆర్ధికంగా నిలదొక్కుకోలేదని, నిలదొక్కుకున్న తర్వాత పెళ్ళి విషయం ఆలోచిస్తానని చెప్పాడు.
దీంతో సృజన తాను మోసపోయానని భావించి గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారణ అయింది. పెళ్ళి రిసెప్షన్లో కూడా ఆమె సంతోషంగానే ఉందని, ఆమె చనిపోయిన తర్వాత బంధువులు చెప్పినప్పటికీ అసలు కారణం.. ఇదని తేలింది. పెళ్ళి కొన్ని నిమిషాల్లో జరుగుతుందనగా, వరడు తాళి కట్టే సమయానికి సృజన పెళ్ళి పీటల మీదనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.