రాష్ట్రంలో భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ ఉద్యోగుల పాపం పండింది. అనేక జిల్లాల్లో వెబ్ లాండ్లో తప్పుడు ఎంట్రీలతో , యాజమాన్య హక్కుల మార్పిడితో చేసిన దారుణమైన అక్రమాలపై సీసీఎల్ఏ తీవ్ర చర్యలు తీసుకుంది. ఈ అక్రమాలకు పాల్పడ్డ 38 మంది తాసిల్దార్ , ఆర్ ఐ తదితర రెవెన్యూ అధికారులపై వేటు వేసింది.
వెబ్ ల్యాండ్ అక్రమాల్లో ముగ్గురు తహశీల్దార్లను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎనిమిదిమంది తాసీల్దార్లను ని సస్పెండ్ చేశారు. ఆరుగురికి ఇచ్చిన ప్రమోషన్ నుంచి రివర్షన్ చేసి , ఒక్కరిని నిర్బంధ పదవీ విరమణ చేయించారు. పీలేరు భూముల కేసుల్లో 12 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్టు నిర్థారించారు.
వెబ్ లాండ్ లో భూమి యజమానుల పేర్లు తొలగించి ఇతరుల పేర్లను చేర్చినట్టు విచారణలో తేల్చిన అధికారులు ఇలాంటి తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. లంచాలకు కక్కుర్తి పడి చేసిన ఈ దారుణాలకు , చివరకు ఉద్యోగాలే పోగొట్టుకున్నారు. మిగిలిన జిల్లాల్లో పనిచేస్తున్న మరో 15 మంది తహశీల్దార్లపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కూడా విచారణ చేస్తున్నారు..