కరనా కష్టకాలంలో ఎవరికి వారు ఇంటికి పరిమితమయ్యారు. కనీసం మిగతా వారితో కలిసేందుకు సైతం భయపడుతున్నారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రేవ్ పార్టీల పేరుతో కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కనీసం కరోనా కాలంలో కూడా వాటికి దూరంగా ఉండటానికి ఇష్టపడటంలేదు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల రేవ్ పార్టీలు జరుగుతున్నాయి.
తాజాగా మహారాష్ట్రలో ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాసిక్లోని ఇగటపురి పట్టణంలో జరుగుతున్న రేవ్ పార్టీ నుంచి మాదకద్రవ్యాలు, హుక్కాలు సీజ్ చేశారు. అరెస్టు చేసినవారిలో 12 మంది మహిళలు ఉన్నారు. దాంట్లో రియాల్టీ టీవీ షో బిగ్బాస్ కంటెస్టెంట్ కూడా ఉన్నట్టు సమాచారం.
కొందరు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీతో లింకున్న మహిళలు కూడా ఉన్నారు. గుర్తు తెలియనివారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రెండు విల్లాలపై రెయిడ్ నిర్వహించారు. స్కై తాజ్, స్కై లాగూన్ అనే విల్లాల్లో ఈ రేవ్ పార్టీలు జరిగాయి. అరెస్టు అయినవారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పార్టీని ఆర్గనైజ్ చేసినవారి కోసం కూడా వెతుకుతున్నారు. పార్టీలో పాల్గొన్నవారిలో చాలా మంది హై ఎండ్ కారుల్లో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్టీతో లింకు ఉన్న ఓ నైజీరియా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై-ఆగ్రా హైవే మధ్య రహదారిలో ఆ విల్లాలు ఉన్నాయి.