ఆ అబ్బాయి అమ్మాయిగా మారాలనుకున్నాడు. తనకు దేవుడు ఇచ్చిన మగ జన్మ వద్దనుకుని, ఆడపిల్లగా మారిపోవాలనుకున్నాడు. దానికోసం అతను లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్ ని తక్కువ ఖర్చుతో ఫ్రెండ్ చేస్తానంటే ఒప్పుకున్నాడు. చివరకు నెల్లూరులోని ఓ హోటల్ గదిలో ఆపరేషన్ మొదలైంది. మర్మాంగం కట్ చేశాడు ఫ్రెండ్, మత్తుమందు ఇవ్వడంలో తప్పు చేశాడు. దీంతో యువతిగా మారాలనుకున్న ఆ యువకుడు చనిపోయాడు.
ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్ అనే యువకుడు చిన్నప్పటినుంచీ ఆడవారి లక్షణాలతో ఉండేవాడు. అతనికి పెళ్లయినా కూడా భార్య విడాకులిచ్చింది. చివరికి అమూల్యగా పేరు మార్చుకుని లింగమార్పిడి ఆపరేషన్ కోసం వేచి చూస్తున్నాడు శ్రీకాంత్.
సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన నెల్లూరుకి చెందిన మస్తాన్ సలహాతో ఆపరేషన్ కి సిద్ధమయ్యాడు. మస్తాన్, అతని స్నేహితుడు, మరో ట్రాన్స్ జండర్ మోనాలిసా.. అందరూ కలసి నెల్లూరులోని ఓ లాడ్జిలో ఆపరేషన్ చేయబోయారు. చివరకు అది వికటించి శ్రీకాంత్ అలియాస్ అమూల్య చనిపోయింది.
నెల్లూరు చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు.