ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ బైక్లు తగలబడిపోవడం… చార్జింగ్ పెట్టిన తర్వాత పేలి పోవడం… తద్వారా మనుషులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. నిన్నటి నిన్న విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెట్రోల్ ధరల పెరుగుదలతో చాలామంది ఎంతో ఆశగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు.
కొనుగోలు కూడా చేస్తున్నారు. అయితే చార్జింగ్ సమయంలోనే, ఎక్కువగా ఎండ తగలడంతోనో… బ్యాటరీలు పేలుతున్నాయి. అకారణంగా మనుషులు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. ఎలక్ట్రిక్ వాహనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలపైనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఓలా ఎలక్టిక్ బైక్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 1,441 యూనిట్ల విద్యుత్తు ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్లను తమ సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేస్తారని, అన్ని బ్యాటరీ సిస్టమ్లు, థర్మల్ సిస్టమ్లు అలాగే భద్రతా వ్యవస్థల్లో క్షుణ్ణంగా డయాగ్నస్టిక్స్ ద్వారా ఈ తనిశీలు జరుగుతాయని కంపెనీ వెల్లడించింది. గత నెలలో పూణెలో జరిగిన ఓ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకునే రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.