హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్స్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బడాబాబుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడితో సహా 150 మంది పట్టుబడ్డారు.
వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ పోలీసు స్టేషన్ లో వారు హంగామా సృష్టించారు. దీంతో కొంతమందికి నోటీసులు ఇచ్చి విడిచి పెట్టినట్లు తెలిసింది. పబ్ పై దాడి చేసినప్పుడు భారీగా డ్రగ్స్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు.
పబ్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. వీకెండ్ కావటంతో భారీస్థాయిలో హోటల్ నిర్వహకులు ఈ పార్టీకి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫాం హౌస్ లు.. రిసార్టుల్లో ఇలాంటి రేవ్ పార్టీల్లో చాలామంది ప్రముఖులు, వాళ్ళ పిల్లలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు.