కొన్నిసార్లు వ్యాపార వర్గాల మధ్య ఉన్న పోటీ వినియోగదారుడికి ఎక్కడలేని లాభం తెచ్చిపెడుతుంది. అలాగే ఈ ఆదివారం మాంసం ప్రియుల పంట పండింది. మటన్ కేజీ 50 రూపాయలకి దిగొచ్చింది. వ్యాపారుల మధ్య ఉన్న పోటీ వల్ల వీరు ఇలా ధర తగ్గించేశారు. ఇంకేముంది అవసరం ఉన్నవారు లేనివాళ్లు.. ఆ ఊరిలో కేజీలకు కేజీలు మటన్ కొని ఇంట్లో పెట్టేసుకున్నారు.
వాల్మీకిపురం రూటే సెపరేటు..
సహజంగా మటన్ కేజీ 800 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంది. చిత్తూరు జిల్లాలో కూడా ఇదే రేటు ఉంది. అయితే వాల్మీకు పురంలో మాత్రం ఆదివారం కేజీ 50 రూపాయలకు పడిపోయింది. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ఇలా విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది.. వాల్మీకిపురంలోని గాంధీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ మాంస విక్రయదారుడు మొదట కిలో మటన్ రూ.300గా విక్రయించాడు.. అయితే, ఇతర వ్యాపారస్తులు పోటీపడంతో.. అది కాస్తా రూ.200.. ఆ తర్వాత రూ.100.. ఇలా కిందకు దిగుతూ వచ్చింది. చివరకు ఓ దుకాణాదారుడైతే కేవలం రూ.50కే కిలో మటన్ అంటూ.. విక్రయాలు సాగించాడట.. ఇలా వ్యాపారస్తులు పోటీ పడి.. చివరకు కిలో రూ.50కే విక్రయించడం హాట్ టాపిక్గా మారిపోయింది.. కొనుగోలుదారులు సైతం పోటీ పడడం.. ఒక్కొక్కరు కిలో, రెండు కిలోలు, ఐదు నుంచి పది కిలోల వరకు కొనుగోలు చేయడంతో రాత్రి 7.30 గంటల వరకే స్టాక్ మొత్తం అయిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే, గతం వారం రోజులుగా అక్కడ మాత్రం కిలో మటన్ రూ.400-500 పలకగా.. పోటీతో మాత్రం ఆ ధర అమాంతం దిగివచ్చింది.