చిన్న పిల్లల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. పడుకునే సమయంలో పడక మీదనే చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 23.8 శాతం మంది పిల్లలు మొబైల్ ఫోన్లు పట్టుకుని, దాన్ని చూస్తూ నిద్ర పోతున్నారనే విషయం ఒక సర్వేలో తేలిందన్నారు.
చిన్నపిల్లల్లో మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల 37.15 శాతం పిల్లల్లో ఏకాగ్రత తగ్గిందని, ఇది ఆందోళన కలిగించే విషయమేనన్నారు. చిన్నపిల్లలు అన్నం తినాలన్నా, నిద్ర పుచ్చాలన్నా ఇటీవలికాలంలో తల్లిదండ్రులే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు.
ఇంట్లో తల్లిదండ్రులు తాను సెల్ ఫోన్ చూసుకోవాలన్న ఆలోచనతో పిల్లలకు కూడా ఒక ఫోన్ ఇచ్చి చూసుకోమని చెప్పడమే ఇప్పటి సామాజిక దురాచారంగా మారిందన్నారు. 2016లో కామన్ సెన్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం 50 శాతం మంది పిల్లలు ఫోన్ లకు బానిసలుగా మారగా, దీని పరిణామం వారి భవిష్యత్తుపై తీవ్రంగా ఉండబోతోందన్నారు. 7, 8 సంవత్సరాలు దాటిన పిల్లలు మొబైల్ ఫోన్లు వాడకం వల్ల, దాని ప్రభావంతో వారి జీవితంలో ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఆన్ లైన్ గేమ్స్ అలవాటు కూడా పిల్లల్లో ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని, ఒక విధంగా పిల్లల మానసిక శారీరక విషయంలో తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. ఫోన్ల వినియోగం ఒక అలవాటుగా కాకుండా ప్రవర్తనలో ప్రతికూల మార్పులు తెచ్చేవిధంగా మారుతోందన్నారు. 12 ఏళ్ళు దాటిన పిల్లల్లో ఫోన్ వినియోగ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటోందని ఫ్రాంటియర్స్ ఇన్ సైక్రియాట్రీ నివేదిక పేర్కొంది. ఇటీవలకాలంలో కరోనా సమయంలో లాక్ డౌన్ వల్ల ఆన్ లైన్ క్లాసుల సమయంలో చాలామంది పిల్లలు ఫోన్ల వినియోగం వల్ల కలిగిన అనర్ధాలు, సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.