తల్లి అక్రమ సంబంధాన్ని 18 ఏళ్ళ తర్వాత ఓ కొడుకు కనిపెట్టాడు. తాను తన తండ్రికి పుట్టలేదని నిర్ధారించుకున్నాడు. ఆ విషయమై తండ్రికి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆమెను నిలదీశారు. తన తండ్రి ఎవరో చెప్పమని, తాను అక్రమ సంతానమా కాదా అని చెప్పాలంటూ ఆధారాలతో సహా బయటపెట్టాడు. విధిలేక అసలు విషయం చెప్పిందా తల్లి. ఇది నమ్మలేని ఒక నిజం. ఇది సినిమాల్లో కూడా మనం చూడని వాస్తవం. ఒక మెడికల్ రిపోర్ట్ ఆధారంగా బయటపడిన ఓ రహస్యం.
ఒరిస్సాలోని భువనేశ్వర్ లో 18 ఏళ్ళ ఓ యువకుడికి కీళ్ళ నొప్పులు వచ్చాయి. తండ్రి చాలా ఆస్పత్రులకు తీసుకెళ్ళి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోవడంతో, ఓ డాక్టర్ సలహా మేరకు ఢిల్లీలోని గుర్ గావ్ లోని ఫోర్తీస్ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్లు హెచ్పీఎల్సీ పరీక్ష చేసి ఆ యువకుడికి సికిల్ సెల్ అనీమియా ఉందని నిర్ధారించారు. దీన్ని నయం చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి. ఇది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించే వ్యాధి. తల్లికి తండ్రికి ఇద్దరికీ ఆ వ్యాధి ఉంటేనే పిల్లలకు వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఇద్దరికీ ఈ వ్యాధి ఉందా లేదా అని పరీక్షించారు. తల్లికి మాత్రం ఈ వ్యాధి ఉంది. అయితే తండ్రికి చేసిన పరీక్షలో ఈ వ్యాధి లేదని నిర్ధారణ అయింది. మళ్ళీ తండ్రికి పరీక్ష చేశారు. రెండోసారి కూడా ఆ వ్యాధి లేదని నిర్ధారణ అయింది.
ఈ వ్యాధి ఉన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఇద్దరికీ ఒక జత క్రోమోజోమ్స్ లో అసమానత ఉండాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి అసమాతన ఉండి మరొకరికి అసమానత లేకపోవడం అసాధ్యం. దీంతో ఈ విషయంపై కొడుకుకి పూర్తి అవగాహన కలిగింది. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. తల్లిని అడిగి నిజం నిగ్గు తేల్చాలని కోరాడు. ఆ తర్వాత తండ్రీకొడుకులు ఇద్దరు తల్లిని గట్టిగా అడగడంతో 20 ఏళ్ళ క్రితం, తన గ్రామంలోని వ్యక్తితో తనకు సంబంధం ఉందని, బహుశా ఆ వ్యక్తి వల్ల నువ్వు పుట్టి ఉంటావని ఒప్పుకుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి కుటుంబాన్ని పరిశీలిస్తే అతడి పిల్లలు కూడా సికిల్ సెల్ అనీమియాతో బాధ పడుతున్నారని అర్ధమైంది. అయితే ఈ విషయంలో కొసమెరుపు ఏమిటంటే, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటూ ఆ కొడుకును బాగు చేయించాలని నిర్ణయం తీసుకుని, వైద్యం చేయాలని డాక్టరుని కోరాడు ఆ తండ్రి.