చెట్టుకి చీరకట్టారు, జాకెట్ వేశారు, పూలు పెట్టారు, కొమ్మలకి గాజులు తొడిగారు, ఆ తర్వాత తాళి కట్టారు. అచ్చు.. పెళ్లికూతురులాగా ముస్తాబు చేశారు. ఇదంతా క్షుద్రపూజలకోసం జరిగిన తంతు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేటలో క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఊడికలపేటలోని మామిడి తోటలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామానికి ఆనుకోని ఉన్న మామిడి తోటలో కొందరు దుండగులు క్షుద్ర పూజలు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
మామిడి చెట్టుకి చీర..
మామిడి చెట్టుకు ఆడవారి ముఖచిత్రం వేసి, చీర కట్టి మేకులు కొట్టి, పువ్వులు పెట్టి మంగళసూత్రం కట్టినట్టుగా ఉంది. తోటలో పూజలపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనన్న కలవరం చెందుతున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేసారంటూ గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని యువకులు ఆటవిడుపు కోసం ఉపయోగించే స్థలంలో ఇలా మామిడి చెట్టుకు భయంకర పూజలు చేయటం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.