వీడు మంగళగిరోడు , మామూలోడు కాదు.. మహాముదురు… దేశముదురు… ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిత్యపెళ్లికొడుకు 13 పెళ్లిళ్లు చేసుకున్నాడని తేలింది. ఎలాగైతే ఏమి , వేడిని హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.. మాయమాటలతో ముగ్గులోకి దింపే వారి వద్ద నుంచి లక్షల్లో నగదు దోచేశాడు. నగనట్రా తీసుకుని ఉడాయించాడు. చివరికి ఈ నిత్య పెళ్ళికొడుకు పాపం పండి.. కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ సాయి ఇంజనీరింగ్ చదివాడు. 2018లో ఓ యువతిని పెళ్ళి చేసుకున్నాడు. మనస్పర్ధల కారణంగా ఆమెకు దూరమయ్యాడు. ఆ తర్వాత నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తాడు. మ్యాట్రిమోనీల్లో ఫేక్ ప్రొఫైల్ పెట్టేవాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నానని, నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుందని, అలాగే తనకు పెళ్ళై డైవర్స్ తీసుకున్నానని, ఓ కూతురు ఉందని చెప్పేవాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలనే ఇతను టార్గెట్ చేసుకుని, కధంతా రక్తి కట్టించేవాడు. అలా ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఇతను పెళ్ళి చేసుకుని, మోసగించిన మహిళల్లో ఏడుగురు ఒకే ఏరియాకు చెందిన వారు కావడం.
శివశంకర్ బాబు ప్రొఫెల్ నచ్చి, ఎవరైనా కాంటాక్ట్ చేశారంటే.. వారిని ఇట్టే బుట్టలో వేసుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలా 13 మంది మహిళలను తన ట్రాప్లో పడేసి పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఈ మోసపోయిన మహిళలంతా విద్యావంతులు, సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నావారే కావడం గమనార్హం. పెళ్ళి సమయంలో భారీగా కట్నకానుకలు తీసుకునేవాడు. ఆ మహిళ పేరు మీదున్న స్థిరచరాస్తులను తన పేరు మీద బదలాయించుకునేవాడు. ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కొన్నాళ్ళు కాపురం చేసేవాడు. ఆ తర్వాత తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి, భార్యను ఉద్యోగం మాన్పించేసేవాడు.
ఎలాగూ అమెరికాకు వెళుతున్నాం కదా.. ఇంక ఉద్యోగం ఎందుకని ఆ భార్యలు కూడా ఉద్యోగాలు మానేసేవారు. మరికొన్నాళ్ళు అమెరికా నుంచి కాల్ లెటర్ రావడం ఆలస్యమవుతోందని చెప్పి నమ్మించేవాడు. ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండి.. పని మీద ఊరికి వెళుతున్నానని చెప్పి, నగదు, నగలు, నట్రా తీసుకుని ఉడాయించేవాడు. ఇలా 13 మందిని మహిళలను పెళ్ళి చేసుకుని బురిడీ కొట్టించాడు. మోసపోయిన ఈ 13 మంది భార్యల్లో రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన ఓ భార్య అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శివశంకర్ బాబు గురించి ఆరా తీయడంతో.. డొంకంతా కదలింది. నిత్య పెళ్ళికొడుకు లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. దీంతో నిత్య పెళ్ళికొడుకుని అరెస్టు చేశారు పోలీసులు.